kcr: మా వాళ్లను ప్రలోభపెట్టాలని చూస్తారా.. మీ కుట్రలు సాగవు.. జాగ్రత్త!: బాల్క సుమన్ హెచ్చరిక

  • ఈ ఓట్ల సునామీలో కాంగ్రెస్, చంద్రబాబు కొట్టుకుపోతారు
  • గెలవబోయే మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తే సహించం
  • చంద్రబాబునాయుడిని, టీ-కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్నాం

రేపు రాబోయేది కేసీఆర్ ఓట్ల సునామీ అని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఓట్ల సునామీలో కాంగ్రెస్, చంద్రబాబు, కోదండరామ్, సీపీఐ, మంద కృష్ణ, గద్దర్.. వీళ్లందరూ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రజాకూటమి అధికారంలోకొస్తుందన్న భ్రమ కల్పించి, తెలంగాణ ఓటర్లను ప్రలోభపెట్టాలని చూశారని, చివరకు లగడపాటి రాజగోపాల్ తో కూడా ప్రయత్నం చేయించారని విమర్శించారు.

మంద కృష్ణ, గద్దర్ లాంటి వాళ్లను కూడా ఆ కలుషితమైన కూటమిలో కట్టిపెట్టారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసి తమ ఆటలు సాగవన్ననిర్ధారణకు వచ్చి, చివరి ప్రయత్నంగా.. గెలవబోయే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబునాయుడిని, టీ-కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్నామని అన్నారు. తెరవెనుక ఉండి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్లందరినీ కూడా హెచ్చరిస్తున్నానని, వాళ్లు కుట్రలు సాగవని అన్నారు.

More Telugu News