delhi: దేశ రాజధానిలో దారుణం.. కుటుంబ సభ్యుల గొంతుకోసిన దుర్మార్గపు భర్త!

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘోరం
  • భార్య, ఇద్దరు పిల్లలపై భర్త హత్యాయత్నం
  • పాప మృతి, కోలుకుంటున్న తల్లి, కొడుకు

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఘోర అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే కాలయముడై ఘాతుకానికి తెగబడ్డాడు. కడుపున పుట్టిన బిడ్డల్ని, భార్యను అత్యంత క్రూరంగా హింసించి కత్తితో పీకలుకోశాడు. ఈ ఘటనలో మూడేళ్ల పాప ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు చికిత్స పొందుతున్నాడు. హత్యాయత్నం జరిగినప్పటి నుంచి కోమాలోకి వెళ్లిన భార్య.. ఎట్టేకేలకు ప్రాణాప్రాయం నుంచి బయటపడటంతో జరిగిన దుర్మార్గాన్ని పోలీసులకు వివరించింది.

అసలేం జరిగిందంటే..!

ఢిల్లీలోని హౌజ్ రాణి అనే ప్రాంతంలో గత నెల 17న ఓ వివాహిత, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఖాకీలకు.. పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి తల్లి ప్రయత్నించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పాప మృతి చెందింది. బాలుడు, తల్లి ఐసీయూలో కోలుకుంటున్నారు. ఆదివారం వివాహిత మోహిసినా కోమాలో నుంచి తేరుకుంది.

దీంతో జరిగిన ఘటనను రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని పోలీసులకు తెలిపింది. తన భర్త, అతడి సోదరుడు కలసి తమ ముగ్గురినీ గొంతు కోసి చంపాలనుకున్నారని వెల్లడించింది. తననైతే బాగా కొట్టారని వాపోయింది. ఉదయం వరకూ కొడుతూనే ఉన్నారని తెలిపింది. అత్త, మామ చూసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఉదయం 7గంటలకు తన కూతుర్ని గొంతు కోయడం చూశానని తెలిపింది. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తన గొంతు కోశారని పూసగుచ్చినట్లు చెప్పింది.

మోహిసినా వాంగ్మూలం ప్రకారం భర్త, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

More Telugu News