urjit patel: బ్రేకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా!

  • కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తి
  • కేంద్రం, ఆర్బీఐ మధ్య పెరిగిన దూరం  
  • ఆర్బీఐకి పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా

కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తితో వున్న ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు మధ్య గత కొంత కాలంగా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంకులో ఉన్న నగదు నిల్వల్లో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఊర్జిత్ పటేల్ తో పాటు మరి కొందరు బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇవే.

'వ్యక్తిగత కారణాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. రిజర్వ్ బ్యాంకుకు గత కొన్నేళ్లుగా వివిధ హోదాల్లో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా. రిజర్వ్ బ్యాంక్ సాధించిన ఘనత వెనుక ఆర్బీఐ స్టాఫ్, అధికారుల కష్టం ఎంతో ఉంది. నా సహచరులు, డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. భవిష్యత్తులో వీరంతా ఆర్బీఐని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతారని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్' అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

2016లో ఆర్బీఐ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఊర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు జరిగింది. ఊర్జిత్ రాజీనామా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని విపక్షాలు అస్త్రంగా మలచుకునే అవకాశం ఉంది. 

More Telugu News