Karnataka: అమ్మే నాన్నకు విషమిచ్చింది... పిల్లలు బయటపెట్టిన తల్లి బాగోతం!

  • కర్ణాటకలోని కృష్ణగిరి జిల్లాలో ఘటన
  • విషపు ఇంజక్షన్ ఇచ్చి, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉరేసిన భార్య, ప్రియుడు
  • పోలీసుల విచారణలో నిజం చెప్పిన పిల్లలు

తన ప్రియుడి కోసం భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఓ వివాహిత బాగోతాన్ని వారి పిల్లలు బయటపెట్టిన ఘటన కర్ణాటకలోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రాజలింగం (35), సోనియా (25) దంపతులకు జీవ, హరి అనే కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా సోనియా అదే ప్రాంతంలోని మరో వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. అయినా ఆమె మారలేదు. వివాహేతర బంధం వద్దని రాజలింగం గొడవ పడుతుంటే, అతని అడ్డు తొలగించుకునేందుకు సోనియా నిర్ణయించుకుంది.

శనివారం రాత్రి రాజలింగం ఇంటికి రాగానే, అప్పటికే అక్కడ మకాం వేసిన సోనియా ప్రియుడు, అతని స్నేహితులు రాజలింగాన్ని బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి విషపు ఇంజక్షన్ చేశారు. ఆపై మృతదేహానికి ఉరేశారు. వారు వెళ్లిపోయిన తరువాత, సోనియా కేకలు పెడుతూ బయటకు వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఏం జరిగిందన్న విషయాన్ని పిల్లలను అడిగారు. వారు విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పడంతో సోనియాను అరెస్ట్ చేశారు. ఆపై ఆమె ఫోన్ నుంచి ప్రియుడికి కాల్ చేయించగా, అప్పటికే అతను పరారయ్యాడని తేలింది. అతని కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News