Andhra Pradesh: అవసరమైతే కేసీఆర్ కు మద్దతు ఇస్తాం.. బీజేపీ నేత జీవీఎల్ కీలక ప్రకటన!

  • తెలంగాణలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉంది
  • కేసీఆర్ దాన్ని క్యాష్ చేసుకున్నారు
  • ఏపీ ఎన్నికల్లో టీడీపీకి పరాజయమే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారానికి దిగడం అధికార టీఆర్ఎస్ కు కలిసివచ్చిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్-చంద్రబాబు పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని తెలిపారు. బీజేపీ మరోసారి మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలని మహాకూటమి నేతలు కుట్ర పన్నుతున్నారన్న ఆలోచనను తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ రేకెత్తించగలిగారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చడంలో కేసీఆర్ మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో మహాకూటమిని అధికారం నుంచి దూరంగా ఉంచడానికి అవసరమైతే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

More Telugu News