ramachandraguha: చరిత్రకారుడు రామచంద్రగుహను బెదిరించిన మాజీ ‘రా’ ఆఫీసర్.. ఘాటుగా జవాబిచ్చిన రచయిత!

  • గోవాలో బీఫ్ తిన్న రామచంద్రగుహ
  • ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్న రచయిత
  • బెదిరింపులకు దిగిన ‘రా’ మాజీ అధికారి

ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్రగుహను భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)కు చెందిన మాజీ అధికారి బెదిరించారు. ఇటీవల గోవా పర్యటన సందర్భంగా గుహ బీఫ్ తినడంతో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ ట్వీట్ ను గుర్తించిన ఆయన.. సాక్షాత్తూ ‘రా’కు చెందిన మాజీ ఉన్నతాధికారి కూడా ఈ తరహాలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హెచ్చరికలన్నింటిని తాను రికార్డు చేసిపెడతానని స్పష్టం చేశారు.

రామచంద్ర గుహ ఇటీవల గోవా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడే బీఫ్ తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ‘రా’కు చెందిన మాజీ అధికారి ఆర్కే యాదవ్ స్పందిస్తూ..‘బీఫ్ తింటూ దాన్ని ప్రచారం చేసుకున్న హిందువు ఎవరైనా అతని జాతికి కళంకమే. అదే పనిని ఇప్పుడు రామచంద్రగుహ చేస్తున్నారు. ఆయన హిందువులందరినీ ఈ చర్యతో రెచ్చగొడుతున్నారు. ఇతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని హెచ్చరించారు.

దీనిపై వెంటనే రామచంద్రగుహ స్పందించారు. తనను బెదిరిస్తూ ట్వీట్ చేసిన ఆర్కే యాదవ్ అనే వ్యక్తి ‘రా’కు చెందిన మాజీ అధికారి అని వ్యాఖ్యానించారు. ఇలా తనను బెదిరిస్తూ చేసే ప్రతీ ట్వీట్ ను రికార్డు చేసి పెడతానని తెలిపారు.

More Telugu News