Chandrababu: ఏపీపై కేంద్రం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది: పురందేశ్వరి

  • కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి పనులు
  • కేంద్ర నిధులతోనే ‘పోలవరం’ పనులు జరుగుతున్నాయి
  • రాష్ట్ర మంత్రుల ఆరోపణలు సబబు కాదు

ఏపీపై కేంద్రం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర నిధులతోనే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడం లేదని రాష్ట్ర మంత్రులు ప్రచారం చేయడం తగదని, నిధుల విడుదలలో కొంత జాప్యం జరగొచ్చుకానీ, ఇవ్వడం లేదని ఆరోపించడం సబబు కాదని హితవు పలికారు.

ఈ సందర్భంగా వాల్మీకి కులస్తుల గురించి ప్రస్తావిస్తూ, వారిని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ న్యాయమైనదేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తో చంద్రబాబు జతకట్టడంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, ఈ పొత్తు అప్రజాస్వామికమని, దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

More Telugu News