Andhra Pradesh: 13 కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న నువ్వు అవినీతి రహిత పాలన అందిస్తావా?: జగన్ పై మంత్రి దేవినేని ఫైర్

  • సాగునీటి ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదు
  • పోలవరం పూర్తయితే వైసీపీ మూతపడుతుంది
  • టీడీపీ ప్రాజెక్టులను వైఎస్ చేపట్టినట్లు చెప్పడం సిగ్గుచేటు

ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్ కు కనీస అవగాహన లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వైసీపీ మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రాజెక్టులపై జగన్ అసత్య ప్రచారానికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. వంశధార ఫేజ్-2 పనులపై ప్రతిపక్ష నేత అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రైతుల పంటలు ఎండిపోకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే తన తండ్రి వైఎస్ ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఉమ విమర్శించారు. 13 కేసుల్లో ఏ1, ఏ2గా ఉన్న జగన్ అవినీతి రహిత పాలన అందిస్తానని చెబుతున్నారని దుయ్యబట్టారు.

భారత శిక్షా స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, అవన్నీ జగన్, విజయసాయి రెడ్డిపై నమోదయి ఉన్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తి అవినీతి రహిత పాలన అందిస్తానంటే నమ్మటానికి ప్రజలు వెర్రివాళ్లు కాదని వ్యాఖ్యానించారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని ఉమ ఎద్దేవా చేశారు.

More Telugu News