BJP: బీజేపీకి షాక్.. రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించిన హీరోయిన్ మాధురీ దీక్షిత్

  • జూన్ లో మాధురిని కలిసిన అమిత్ షా
  • పూణే నుంచి పోటీ చేస్తారన్న పార్టీ వర్గాలు
  • వార్తలను ఖండించిన బాలీవుడ్ నటి

2019 పార్లమెంటు ఎన్నికల్లో పూణే స్థానం నుంచి మాధురీ దీక్షిత్ ను పోటీకి నిలపాలని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో మాధురితో సమావేశమైన బీజేపీ చీఫ్ అమిత్ షా పూణే పార్లమెంటు స్థానానికి పోటీ చేసే విషయమై ఆమెతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన రాజకీయ అరంగ్రేటంపై మాధురీ దీక్షిత్ తాజాగా స్పందించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ పై పోటీ చేయబోవడం లేదని తేల్చిచెప్పింది. తన రాజకీయ ప్రవేశంపై మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేసింది.

వాటిని అభిమానులు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఈ ఏడాది జూన్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా  వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. గత నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. మాధురీ దీక్షిత్ కు పూణే టికెట్ ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందని తెలిపారు. దీంతో తాజాగా మాధురీ దీక్షిత్ తన రాజకీయ ప్రవేశంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

More Telugu News