Rat: ఎలుక కోసం పుట్టను తవ్వుతుంటే... కాటేసిన పాము!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • పొలంలో ఎలుకలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి
  • నాటు వైద్యం పొందుతూ మృతి

ఎలుకలను పట్టేందుకు పుట్టను తవ్వుతున్న యువకుడిని పాము కాటేసి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె సమీపంలోని దామరకుంటకు చెందిన సిద్ధప్ప కుమారుడు పెద్దబ్బోడు (28) కూలి పనులను చేయడం, ఎలుకలు పట్టడం, అడవి దినుసులు సేకరించి విక్రయించడం వంటి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్నాడు.

నిన్న చుక్కావారిపల్లె సమీపంలోని పొలాల్లో ఎలుకలు పట్టేందుకు ఒప్పుకుని వెళ్లిన అతను, ఓ పుట్టను తవ్వుతుండగా, అందులో నుంచి బయటకు వచ్చిన పాము కాటేసింది. ఆపై అతను ఆసుపత్రికి వెళ్లకపోగా, నాటు వైద్యాన్ని ఆశ్రయించాడు. విషం శరీరానికి ఎక్కడంతో చికిత్స పొందుతూ మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News