Suryapet District: లంచ్ టైమ్ అయిందంటూ పోలింగ్ బూత్ కు తాళం.. సూర్యాపేట జిల్లాలో సిబ్బంది నిర్వాకం

  • తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఘటన
  • 291వ పోలింగ్ బూత్ కు తాళం
  • వాట్సాప్ లో ఫొటోలు పెట్టిన ఓటర్లు

సూర్యాపేట జిల్లాలో పోలింగ్ సిబ్బంది నిర్వాకంపై ఓటర్లు మండిపడుతున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో, క్యూలో భారీ ఎత్తున ఓటర్లు ఉన్న తరుణంలో... లంచ్ టైమ్ అయిందంటూ, పోలింగ్ బూత్ కు పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలోని  291వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓటర్లు దీనికి సంబంధించిన ఫొటోను తీసి, వాట్సాప్ లో పెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

నిబంధనల ప్రకారం భోజన సమయంలో పోలింగ్ సిబ్బంది ఒకరి తర్వాత మరొకరు వెళ్లి భోజనం చేసి రావాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ ఆగిపోకుండా సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఏ క్షణంలో వచ్చినా, వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పోలింగ్ సిబ్బంది మళ్లీ వచ్చి, తాళం తెరిచారు. 

More Telugu News