Andhra Pradesh: అవును.. పవన్ కల్యాణ్ కు నిజంగానే తిక్క ఉంది!: కాలువ శ్రీనివాసులు

  • ఉదయం చెప్పింది సాయంత్రానికి మర్చిపోతారు
  • ప్రత్యేక హోదా పోరాటంపై ఆయన  మాటతప్పారు
  • అనంతపురంలో గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నిజంగానే తిక్క ఉందని ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. ఉదయం పూట మాట్లాడిన విషయాలను పవన్ రాత్రికి మర్చిపోతారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పోరాటం విషయంలో పవన్ మాట తప్పారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గోట్లూరులో ఈరోజు నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానని జనసేనాని ప్రకటించారని గుర్తుచేశారు. కానీ కేంద్రం హోదా ఇవ్వకపోయినా పవన్ కల్యాణ్ నోరు మెదపలేదని విమర్శించారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా రైతు నీరుగంటి సెంటన్న రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష  విరాళం అందజేశారు.

More Telugu News