Andhra Pradesh: ఏపీ వాళ్లకు ఇక్కడ కాన్పులు చేయం.. గర్భిణికి వైద్యం నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వ వైద్యులు!

  • రోడ్డుపైనే చిన్నారికి జన్మనిచ్చిన యువతి
  • భయంతో చివరికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న తెలంగాణలోని 7 మండలాలను కేంద్రం ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయినందున పోలవరం ముంపు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి చికిత్స అందించేందుకు తెలంగాణ వైద్యులు నిరాకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని మల్లెతోట గ్రామానికి చెందిన అనూషకు నిన్న అర్ధరాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఊరు ఏపీలో ఉండటంతో కాన్పు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. అనూష నొప్పితో విలవిలలాడుతున్నా, చింతూరు ఏరియా ఆసుపత్రికి పోవాలని సూచించారు. దీంతో బాధితురాలిని తీసుకువెళుతుండగా, ఆసుపత్రి గేటువద్దే ఆమె పండంటి చిన్నారికి జన్మినిచ్చింది.

ఈ ఘటనను గమనించిన సిబ్బంది ఏ ఇబ్బంది వస్తుందో అని భయపడ్డారు. వెంటనే తల్లీబిడ్డలను ఆసుపత్రిలోకి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం ఇద్దరినీ చింతూరు ఏరియా ఆసుపత్రికి పంపారు. కాగా, ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీది ఆంధ్రా.. మాదేమో తెలంగాణ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మేం మీకు డెలివరీ చేయం’ అంటూ అమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె రోడ్డుపై ప్రసవించిందనీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News