Raj Tarun: ఆ ఒక్క ఫోటోను ఎవరికీ చూపించను... చచ్చేవరకూ నాతోనే ఉంచుకుంటా: హీరో రాజ్ తరుణ్

  • నేను మహేష్ బాబు వీరాభిమానిని
  • ఆయనతో దిగిన ఫోటో నా వ్యక్తిగతం
  • ట్విట్టర్ వేదికగా అభిమానుల ప్రశ్నలకు రాజ్ తరుణ్ సమాధానాలు

'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో పేరు తెచ్చుకుని తెలుగు లోగిళ్లలో సొంత కుర్రాడి ఇమేజ్ ని సొంతం చేసుకున్న రాజ్ తరుణ్, చాలా రోజుల తరువాత, ట్విట్టర్ వేదికగా అభిమానులతో మాట్లాడాడు. అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తన తదుపరి చిత్రం అవికా గోర్ తో ఉంటుందని, మంచి కథ కోసం ఎదురు చూడబట్టే, నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేయడానికి సమయం తీసుకున్నానని అన్నాడు. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు ఉదాహరణని, రామ్ అద్భుతమైన వ్యక్తని అన్నాడు.

ఇక ఓ అభిమాని మహేశ్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరితే, తాను మహేష్ కు ఎల్లప్పటికీ విరాభిమానినేనని అన్నాడు. మహేశ్ ను కలిసి ఓ ఫోటో తీసుకుని మాతో పంచుకోవచ్చుకదా? అని ఇంకో అభిమాని అడిగితే, "నేను కలిశాను. ఫొటో కూడా దిగాను. కానీ దాన్ని పోస్ట్‌ చేయను. షేర్‌ చేయను. అది నేను చనిపోయేవరకు నాతోనే ఉండిపోతుంది. అది నా వ్యక్తిగత విషయం" అని చెప్పాడు.

అందరు అభిమానుల్లానే తాను కూడా 'మహర్షి' సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నానని అన్నాడు. 'పోకిరి' వంటి సినిమా చేయాలని మరో అభిమాని కోరితే, "పోకిరి ఒక్కటే ఉంటుంది. ఇంకోటి రాదు రాలేదు" అని చెప్పాడు. రష్మిక మందన అందంగా నటిస్తుందని, కానీ ఆమెనింకా కలవలేదని రాజ్ తరుణ్ చెప్పాడు.

More Telugu News