snake: తాచుపాము నుంచి కాపాడండి మహాప్రభో.. అర్ధరాత్రి ఏకంగా ముఖ్యమంత్రికే ఫోన్ చేసిన వ్యాపారి!

  • పుదుచ్చేరిలోని అరియాంకుప్పవలో ఘటన
  • వెంటనే స్పందించిన సీఎం నారాయణ స్వామి
  • ఇద్దరు అధికారులను పంపి పాము పట్టివేత
  • శభాష్ అంటున్న నెటిజన్లు

సాధారణంగా ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే అటవీశాఖ అధికారులకో, లేకుంటే స్నేక్ సొసైటీ సభ్యులకో ఫోన్ చేస్తారు. తాజాగా ఓ వ్యాపారి కూడా అలాగే స్పందించాడు. అయితే అధికారులెవరూ స్పందించకపోవడంతో ఏకంగా ముఖ్యమంత్రికే ఫోన్ కొట్టాడు.

అర్ధరాత్రి ఫోన్ రావడంతో ఎత్తిన ముఖ్యమంత్రి, సమస్యను విని విసుక్కోకుండా ధైర్యం చెప్పారు. అనంతరం సదరు వ్యాపారి ఇంటికి వెళ్లి సాయం చేయాల్సిందిగా అధికారులను పురమాయించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారికి భార్య విజయ, కుమారుడు వసంత్, కుమార్తె సంధ్య ఉన్నారు. అయితే మంగళవారం రాత్రి వీరంతా నిద్రపోతుండగా ఇంట్లోకి ఓ తాచుపాము వచ్చేసింది. వీరిని చూసి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఈ శబ్దానికి మేల్కొన్న రాజా కుటుంబ సభ్యులను వెంటనే లేపాడు. అనంతరం పామును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ కొట్టాడు. అయితే ఎవరూ స్పందించలేదు. ఇంతలోనే పాము ముందుకు దూసుకొచ్చేందుకు యత్నించింది.

దీంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకున్న రాజా.. ఏకంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకున్నారు.

కదలకుండా ధైర్యంగా ఉండాలనీ, తాను వెంటనే అధికారులను పంపుతానని సూచించారు. అనంతరం ఇద్దరు అటవీశాఖ అధికారులకు సంబంధిత అడ్రస్ కు వెళ్లాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నారాయణస్వామి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News