Chandrababu: మారబోతున్న దేశ రాజకీయాలకు ఇది నాంది!: 'ప్రజాకూటమి' మీడియా సమావేశంలో చంద్రబాబు

  • తెలంగాణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి
  • రాష్ట్రాన్ని నాశనం చేశారు
  • ఇక్కడి నేతలకు మేమంతా సహకరిస్తాం

ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారని... కానీ గత నాలుగున్నరేళ్లలో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో మహాకూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ధనిక రాష్ట్రమని, గొప్పగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో ఎన్నో వనరులు, అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ, రాష్ట్రాన్ని నాశనం చేసేశారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు గొప్ప మలుపని, మారబోతున్న దేశ రాజకీయాలకు ఇది నాంది అని అన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను విడదీస్తున్నాయని... ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రజలను విడదీయడం ద్వారా ఆ పార్టీలు లబ్ధిని పొందలేవని తెలిపారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో, ఇక్కడి నేతలకు తామంతా సహకరిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవితవ్యాన్ని మార్చబోతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజాకూటమిని గెలిపించాలని విన్నవించారు. 

More Telugu News