Revanth Reddy: రేవంత్ అరెస్ట్ వ్యవహారం.. డీజీపీ రావాల్సిందే.. మాకు సమాధానం చెప్పాల్సిందే: హైకోర్టు

  • అర్ధరాత్రి రేవంత్ ను అరెస్ట్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం
  • డీజీపీ కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశం
  • మధ్యాహ్నం 2.30కు విచారణ వాయిదా

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి రేవంత్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే రేవంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు.

 దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. డీజీపీ కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని, అరెస్ట్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా కేసుల విచారణలో బిజీగా ఉన్నామని... కోర్టుకు రావడానికి డీజీపీ ఒక్క గంట సమయాన్ని కేటాయించలేరా? అని కోర్టు ప్రశ్నించింది. డీజీపీ కోర్టుకు వచ్చి నేరుగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.  

More Telugu News