Telangana: చంద్రబాబు పొత్తు కోసం రెడీగా ఉన్నారని చెప్పా.. కానీ కేటీఆర్ మాత్రం వినిపించుకోలేదు!: లగడపాటి

  • కేసీఆర్ ఒప్పుకోవడం లేదన్నారు
  • ఒంటరిగా గెలిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు
  • మహాకూటమి వస్తే ఇబ్బందేనని హెచ్చరించా

టీఆర్ఎస్, ప్రతిపక్షాలకు మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందని తాను ముందుగానే హెచ్చరించానని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. అభ్యర్థులను మార్చకుంటే తీవ్రంగా ఇబ్బంది పడతారని కేటీఆర్ కు సూచించానని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుపుకుని ఓ 20 సీట్లు ఇస్తే వార్ వన్ సైడ్ అయిపోతుందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు.

పొత్తుకు చంద్రబాబు సైతం ఆసక్తిగా ఉన్న విషయాన్ని కేటీఆర్ కు చెప్పానన్నారు. అయితే ఇందుకు కేటీఆర్ అంగీకరించకపోగా..‘ఈసారి మేమే ఒంటరిగా గెలిచేస్తాం. మాకు పొత్తు అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారని గుర్తుచేసుకున్నారు.

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉన్న ఓట్ల తేడాలో టీడీపీ షేర్ 6 శాతం ఉండగా, కమ్యూనిస్టులు, టీజేఎస్ కలిపి ఓ 4 శాతం వరకూ ఉంటాయన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ఎన్నికలు టైట్ గా మారుతాయనీ, అందుకు సిద్ధంగా ఉండాలని అప్పట్లోనే కేటీఆర్ ను తాను హెచ్చరించానని లగడపాటి అన్నారు. సీట్ల పంపకంలో మహాకూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు. మిత్రపక్షాల నేతలు వెనక్కి తగ్గడం వల్ల ఓట్ల బదిలీ సులభంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుతో కలవకపోవడం తన నిర్ణయం కాదనీ, సీఎం కేసీఆర్ దేనని కేటీఆర్ చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు పోటాపోటీగా మారితే ఎమ్మెల్యేల గుణగణాలు, సామర్థ్యం చర్చకు వస్తాయనీ, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. చివరి 15 రోజుల్లో ఓటర్లపై ఇవన్నీ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

More Telugu News