Revanth Reddy: చీకటి గదిలో కసబ్ ను ఎలాగైతే ఉంచారో నన్నూ అలాగే ఉంచారు: రేవంత్ రెడ్డి

  • తెల్లవారుజామున పోలీసులు నన్ను పట్టుకుపోయారు
  • నన్ను ఓ గదిలో ఉంచి గొళ్లాలు పెట్టారు
  • నాతో పాటు ఓ అధికారిని కూడా ఉంచారు

అంతర్జాతీయ ఉగ్రవాది కసబ్ ను ఎలాగైతే చీకటి గదిలో ఉంచారో, అలాగే తనను కూడా పోలీసులు ఉంచారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెల్లవారుజామున తనను పట్టుకుపోయిన పోలీసులు ఓ గదిలో ఉంచి లోపల, బయటా గొళ్లాలు పెట్టారని, తనతో పాటు ఓ అధికారిని కూడా ఉంచారని అన్నారు. కనీసం, తనను బయటకు కూడా రానీయలేదని, పైజామా, టీషర్ట్ ధరించి ఉన్న తనకు వేరే బట్టలు కూడా తెప్పించలేదని విమర్శించారు.

 తానేమి నేరగాడిని కాదని, ప్రజాప్రతినిధిని అని, పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడినని అన్నారు. కోస్గీలో టీఆర్ఎస్ సభ అయిపోయిన తర్వాత, తమ పార్టీ కార్యకర్తలపై వారు దాడి చేశారని తనకు సమాచారం అందిందని, ఒక నాయకుడిగా తాను స్పందించాలా? వద్దా? అని ప్రశ్నించారు. కేవలం, పోలీసులతో రాజ్యాన్ని నడిపించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటే కుదరదని, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, తమ కార్యకర్తలకు ఆపద వస్తే చూస్తూ ఊరుకోనని, తక్షణం వారి వద్దకు వెళతానని రేవంత్ రెడ్డి అన్నారు.

More Telugu News