kcr: ఎంతమందితో నేను పోరాడాలి? ఎన్ని రాకాసులతో కొట్లాడాలి?: సీఎం కేసీఆర్

  • పాలమూరుకు శత్రువులు ఇక్కడే ఉన్నారు?
  • ఇది కరవు జిల్లా.. అంతా కొండలు, బండలు, గుట్టలే
  • దరిద్రం వదలాలంటే ఈ దరిద్రులను వదిలించాలి

పాలమూరు జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు శత్రువులెక్కడో లేరని ఇక్కడే ఉన్నారని, ఎంతమందితో తాను పోరాడాలి? ఎన్నో రాకాసులతో కొట్లాడాలి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో జరిగిన టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు కరవు జిల్లా అని, కొండలు, బండలు, గుట్టలు, రాళ్లు.. మధ్య మధ్యలో చిన్న పొలాలు ఉన్నాయని అన్నారు. నాడు ఉద్యమ సమయంలో జయశంకర్, తాను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ పరిస్థితిని చూసి, ఎలా బాగుపడుతోందనని బాధపడ్డ విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

కొడంగల్ ప్రాంతానికి నీళ్లు లేవని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, రూ.35 వేల కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ పథకం పూర్తయితే కనుక కొడంగల్, పాలమూరు, నారాయణపేట సస్యశ్యామలం అవుతుందని అన్నారు. నాగం జనార్దన్ రెడ్డితో మరో ఇద్దరు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ కోర్టులో కేసులు వేస్తే, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న కేసులివని హైకోర్టు వారికి బుద్ధి చెప్పిందని అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చూసిన చంద్రబాబుతో పాటు మన దరిద్రులు కూడా కలిశారని, ఇటువంటి వాళ్లు ఈ జిల్లాలో పుట్టారు కనుకనే ఇక్కడ కొండలు, బండలు.. ఈ దరిద్రమంతా మనకుందని అన్నారు. పాలమూరు దరిద్రం వదలాలంటే ఈ దరిద్రులను వదిలించాలని, వీళ్లకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ అన్నారు.

More Telugu News