Pakistan: కాబోయే భార్యతో సెల్ఫీ... సంప్రదాయం కాదంటూ కూతురికి విషం పెట్టి, కొడుకును కాల్చి చంపిన తండ్రులు!

  • పాకిస్థాన్ లో దారుణ ఘటన
  • కాబోయే భార్య ఇంటికి వెళ్లి సెల్ఫీలు దిగిన యువకుడు
  • ఇద్దరినీ చంపేసిన తండ్రులు

నిశ్చితార్థమైనప్పటికీ, వివాహం కాకుండా కలుసుకోవడమే కాకుండా, సెల్ఫీలు దిగి తమ పరువు తీశారని ఆరోపిస్తూ, ఓ తండ్రి తన కుమారుడిని కాల్చి చంపగా, మరో తండ్రి తన కుమార్తెకు విషం పెట్టి హత్య చేసిన దారుణ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. 'డాన్' పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత తన కాబోయే భార్య ఇంటికి వెళ్లిన యువకుడు, ఆమెతో మాట్లాడటంతో పాటు సెల్ఫీలు దిగాడు.

ఇలా చేయడం ఇస్లాం మత సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన ఆ జంట తండ్రులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ దగ్గరి బంధువులే కావడం గమనార్హం. వీరి చర్యతో తమ పరువు పోయిందన్న ఉక్రోషంతో తమ బిడ్డల ప్రాణాలు తీశారు. తన కుమార్తెను చంపిన తండ్రి, ఆమే విషం తాగి మరణించిందని చెబుతూ, హడావుడిగా మృతదేహాన్ని ఖననం చేయించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, బాధితురాలి తండ్రి, తాతలను అరెస్ట్ చేసి, మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం జరిపించారు. ఆపై యువకుడి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.

More Telugu News