T news: నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల ఫిర్యాదు

  • ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వార్తలు
  • ఈ రెండు సంస్థల్లోనూ డైరెక్టర్‌గా కేటీఆర్
  • ఫిర్యాదుకు నమస్తే తెలంగాణ పేపర్‌ను జత చేసిన ఎంపీ

నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానల్‌పై టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఈ రెండు మాధ్యమాల్లోనూ వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న ఈ రెండింటిలోనూ కేటీఆర్ డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా పత్రిక, చానల్‌లో వార్తలను ప్రసారం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా నవంబరు 26వ తేదీనాటి నమస్తే తెలంగాణ పత్రికను ఫిర్యాదుకు జత చేశారు. ఆ రోజు పేపర్లోని వార్తల్లో 95 శాతం టీఆర్ఎస్‌కు కేటాయించినట్టు కనకమేడల పేర్కొన్నారు.

హేతుబద్ధత లేని సర్వేలను ప్రచురించడమే కాకుండా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీల నేతల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలను ప్రచురిస్తున్నారని/ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వార్తలను ప్రచారం చేస్తున్న ఈ రెండింటిపైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కనకమేడల కోరారు.

More Telugu News