Revanth Reddy: ఉగ్రవాదిని తీసుకెళ్లినట్టు ఈడ్చుకెళ్తారా?.. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి భార్య మండిపాటు

  • తలుపులు బద్దలుగొట్టి లోపలికి వచ్చారు
  • ఉగ్రవాదిని ఈడ్చుకెళ్లినట్టు బరబరా ఈడ్చుకెళ్లారు
  • ఇది ముమ్మాటికీ కొడంగల్ ప్రజలపై దాడే

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన భార్య గీత మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఓ ఉగ్రవాదిలా చూశారని, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారని ఆరోపించారు. అందరం ఉండగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆయనను ఉగ్రవాదిలా బరబరా ఈడ్చుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం ఐడీ కార్డులు కూడా చూపించకుండా పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారని, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరింట్లోకి పడితే వారింట్లోకి వెళ్లడానికి పోలీసులకు హక్కు ఉందా? అని ప్రశ్నించారు. అటువంటి హక్కును రాజ్యాంగం వారికేమైనా ఇచ్చిందా? అని నిలదీశారు. తమ ఇంటికి వచ్చిన పోలీసులు ఎవరో కూడా తమకు తెలియదని, ఒక అధికారి మాత్రం పై అధికారుల ఆదేశాల మేరకే అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారని గీత తెలిపారు.

 ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసన తెలపాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని, నియంత పాలనకు చరమ గీతం పాడాలని కోరారు.

More Telugu News