kcr: కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన సీపీఐ నేతలు

  • కేటీఆర్ వెకిలి మాటలు మాట్లాడటం ఎందుకు?
  • ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే ప్రధాన పోటీ
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదు?

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న మగ్దూంభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజకీయాల్లో కూడా వేలు పెడతానన్న కేటీఆర్, వెకిలి మాటలు మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు పెద్దగా ఆదరణ ఉండకపోచ్చని అభిప్రాయపడ్డారు. నాడు తమ మేనిఫెస్టోలో పొందుపరచని అంశాలను కూడా అమలు చేశామని చెబుతున్న కేసీఆర్, ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత మేనిఫెస్టోలోని అంశాలనే అమలు చేయని కేసీఆర్, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీలపై ఆయన విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతి ముద్ర వేసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు.

కేసీఆర్ నోరు పబ్లిక్ టాయిలెట్ లాంటిది: సురవరం

సీఎం కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గద్వాలలో నిర్వహించిన ప్రజాకూటమి ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నోరు పబ్లిక్ టాయిలెట్ లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం ద్వారా ప్రజలపై తీవ్ర భారం మోపారని కేసీఆర్ పై సురవరం మండిపడ్డారు.

More Telugu News