Telangana: చంద్రబాబు అనవసరంగా తెలంగాణలో వేలు పెట్టారు.. నేను తప్పకుండా ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటా!: కేసీఆర్

  • చంద్రబాబుకు పాలించుకోవడానికి ఏపీ ఉంది
  • అయినా బాబు తెలంగాణలో జోక్యం చేసుకున్నారు
  • ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశమంతా పర్యటిస్తా

టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఆయన తెలంగాణలో జోక్యం చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఈ రోజు అదే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చంద్రబాబుతో కలిసి కిరికిరి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ మేరకు స్పందించారు.

చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారనీ, ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాను తప్పకుండా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశమంతా పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయమై పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో ఇప్పటికే మాట్లాడినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

More Telugu News