Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

  • ఏపీ పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపట్టారు?
  • ఎన్ఐఏకు కేసును ఎందుకివ్వలేదు
  • ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగితే ఏపీ పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసును తక్షణం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఎందుకు అప్పగించలేదో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు.

సిట్ అధికారుల విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5(ఎల్లుండికి)కు వాయిదా వేసింది.

More Telugu News