Telangana: తెలంగాణలో త్వరలోనే ‘నంద్యాల’ మోడల్ అమలు చేయబోతున్నారు!: విజయసాయిరెడ్డి వార్నింగ్

  • ఏపీలో కరవుతో రైతులు అల్లాడుతున్నారు
  • బాబు తెలంగాణలో డబ్బుల్ని పంచుతున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో రుతుపవనాలు ముఖం చాటేయడంతో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతన్నలు అల్లాడిపోతుంటే.. వీరిని పట్టించుకునే తీరికలేని యూటర్న్ బాబు (చంద్రబాబు), ఏపీలో దోచుకున్న డబ్బును తెలంగాణలో పంచే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. పార్క్ హయత్ లో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా చంద్రబాబు చీటింగ్ కళకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అబ్బురపడిపోయి తెలంగాణ ఎన్నికల మేనేజ్ మెంట్ మొత్తాన్ని ఆయన చేతికి అప్పగించారని ఎద్దేవా చేశారు.

అందుకే చంద్రబాబు హైదరాబాద్ లో మకాం వేసి ఏపీలో దోచుకున్న నిధులతో నంద్యాల మోడల్ ను ప్రయోగించే పనిలో పడ్డారని విమర్శించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు ఆదిగురువైన చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడంలో ఉన్న స్కిల్స్ చూసి రాహుల్ కు దిమ్మతిరిగి పోయిందని ఎద్దేవా చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా ఓట్లను హోల్ సేల్ గా కొని ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయొచ్చో నాయుడు బాబు రాహుల్ బాబాకు ఉపదేశించారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

More Telugu News