Khammam District: కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మధిర పట్టణ అధ్యక్షురాలు.. షాక్‌లో టీఆర్‌ఎస్‌!

  • కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఉషారాణి
  • ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టివిక్రమార్క సమక్షంలో పార్టీలో చేరిక
  • అధికారంలోకి వస్తే మధిరను స్మార్ట్ సిటీ చేస్తామన్న భట్టి

ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జల్లా మధిర నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ మధిర పట్టణ అధ్యక్షురాలు ఉషారాణి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టివిక్రమార్క సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మధిర నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మధిర పట్టణాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రపాలెం డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతుల ఆత్మహత్యకు కారణమవుతున్న నకిలీ విత్తనాలు లేకుండా చేయడం లక్ష్యమని చెప్పారు. మధిరను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేయనున్నట్లు విక్రమార్క తెలిపారు.

More Telugu News