TRS: టీఆర్ఎస్ వస్తే ‘కాళేశ్వరం’..కూటమి వస్తే శనేశ్వరం వస్తుంది: మంత్రి హరీశ్ రావు

  • కూటమి విజయం సాధిస్తే చీకటి తెలంగాణ వస్తుంది
  • కాంగ్రెస్ ధ్యాసంతా అధికారంపైనే
  • మా ప్రభుత్వం రైతు పక్షపాతి

తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని, అదే, ప్రజా కూటమి కనుక గెలిస్తే శనేశ్వరం వస్తుందంటూ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. పొరపాటున ప్రజా కూటమి కనుక విజయం సాధిస్తే వెలుగుల తెలంగాణ పోయి, చీకటి తెలంగాణ వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుని ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ధ్యాసంతా అధికారంపై తప్ప, అభివృద్ధిపై ఉండదని విమర్శించారు.

 కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది రాజకీయమని, టీఆర్ఎస్ కు కావాల్సింది రైతులని అన్నారు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నప్పుడు, పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీలో కూర్చుని నవ్వులు చిందించిన విషయాన్ని ప్రస్తావించారు. పొన్నాల లక్ష్మయ్య గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చెరువు కూడా నింపలేదని, నాడు చంద్రబాబు పాలనలో 15 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తోందని, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని స్పష్టం చేశారు.

More Telugu News