Andhra Pradesh: నందమూరి సుహాసినికి షాకిచ్చిన ఎన్టీఆర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయం!

  • ఇప్పటికే మద్దతు ప్రకటించిన యంగ్ టైగర్
  • ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వస్తారని చెప్పిన సుహాసిని
  • ఈసీకి సమాచారం ఇవ్వని మహాకూటమి నేతలు

తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో బాలకృష్ణ, కల్యాణ్ రామ్ భార్య స్వాతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని నందమూరి సుహాసిని ఆశించారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క సుహాసినికి షాక్ ఇచ్చారు. ఈ ప్రచారానికి వెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుమించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుందనీ, అయితే టీడీపీ, మహాకూటమి నేతలు ఇప్పటివరకూ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించడంపై ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

More Telugu News