USA: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.హెచ్.డబ్ల్యూ బుష్ కన్నుమూత!

  • హూస్టన్ లోని సొంతింటిలో తుదిశ్వాస
  • 41వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్
  • నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ కన్నుమూశారు. హూస్టన్ లోని స్వగృహంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. బుష్ కుమారుడు జార్జ్ బుష్ అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయగా, జెఫ్ బుష్ టెక్సాస్ కు గర్నవర్ గా పనిచేశారు. మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924, జూన్ 12న బుష్ జన్మించారు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)కు డైరెక్టర్ గా పనిచేశారు.

రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్ అంచలంచెలుగా పార్టీలో ఎదిగారు. నిక్సన్ హయాంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహించారు. అలాగే 1981-89 మధ్యకాలంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికా 41వ అధ్యక్షుడిగా(1989-93) ప్రమాణస్వీకారం చేశారు.

కేవలం 18 సంవత్సరాలకే అమెరికా నావికాదళంలో చేరి పిన్న వయస్కుడైన పైలెట్ గా బుష్ అప్పట్లోనే చరిత్ర సృష్టించారు. కాగా, బుష్ మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. బుష్ కుమారుడు జార్జ్.డబ్ల్యూ.బుష్ సైతం అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. 

More Telugu News