Jai Ram Ramesh: ఆ కారు నెట్టితేనే స్టార్ట్ అవుతుంది.. మోదీ, కేసీఆర్ ఇద్దరూ బ్లఫ్ మాస్టర్లే: జైరాం రమేశ్

  • బీజేపీ, టీఆర్ఎస్‌కు మజ్లిస్ ఆక్సిజన్ ఇస్తోంది
  • ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాం హౌస్‌కే
  • మహబూబ్‌నగర్‌లో ప్రజాకూటమి స్వీప్

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ బ్లఫ్ మాస్టర్లలా తయారయ్యాని, వీరికి మజ్లిస్ తోడైందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌లకు అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిందన్నారు. మధ్యలో మజ్లిస్ ఆ రెండు పార్టీలకు ఆక్సిజన్ అందిస్తోందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అని గుర్తు చేసిన మాజీ మంత్రి.. అది నెట్టితే తప్ప స్టార్ట్ కాదని, ఎన్నికల తర్వాత అది మ్యూజియంకు, దాని అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణ ఫలితాలే బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 స్థానాల్లోనూ ప్రజాకూటమి నేతలు విజయం సాధిస్తారని జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News