Chandrababu: పాపం! రాజకీయాలు తెలియని నందమూరి సుహాసినిని ఇక్కడ నిలబెట్టారు!: మంత్రి కేటీఆర్

  • లోకేశ్ ను మంత్రిని చేసినట్టు ఆమెనూ చేయొచ్చుగా?
  • ఆ అమ్మాయిని బలిపశువుని చేయడానికి కుట్ర 
  • కూకట్ పల్లి రోడ్ షోలో విమర్శలు 

కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసినిని బరిలోకి దించడంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కూకట్ పల్లిలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ‘పాపం! నందమూరి సుహాసిని గారికి రాజకీయాలు తెలియవు. ఆమెను తీసుకొచ్చి కూకట్ పల్లిలో నిలబెట్టారు.

నేను ఒక్క మాట అడుగుతున్నాను.. చంద్రబాబునాయుడుగారికి నిజంగా నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే.. మీ సుపుత్రుడు నారా లోకేశ్ ను ఏపీలో మంత్రిని చేసినట్టుగా ఆమెను మంత్రిని చేయొచ్చుగా? ఇక్కడ ఎందుకు నిలబెట్టాలి? నారా లోకేశ్ గారు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యారు కదా ఆంధ్రప్రదేశ్ లో! హరికృష్ణ గారిని కూడా గతంలో ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసుకున్నారుగా!

మరి, హరికృష్ణ గారి కూతురు మీద, ఎన్టీ రామారావుగారి మనుమరాలి మీద చంద్రబాబునాయుడు గారికి అంత ప్రేమ ఉంటే ఆమెను ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిని చేయలేదు? పోనీ, నిజంగానే తెలంగాణలో తెలుగుదేశం పాగా వేయాలన్న ఆలోచన చంద్రబాబునాయుడు గారికి ఉంటే.. లోకేశ్ ను దింపొచ్చు కదా ఇక్కడ? ఎందుకు దింపలేదు?

లోకేశ్ ను దింపరు! చంద్రబాబునాయుడు గారికి తెలుసు.. ఇది ఓడిపోయే సీటు అని. కచ్చితంగా ఓడిపోతారని తెలిసి ఈరోజున ఆ అమ్మాయిని బలిపశువుని చేయడానికి, ఆ అమ్మాయి తమ్ముళ్లను కూడా రేపు రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకే ఈ కుట్రలు తప్ప, ప్రేమ లేదనే మాట నాకూ తెలుసు మీకూ తెలుసు’ అని కేటీఆర్ విమర్శించారు.

More Telugu News