Andhra Pradesh: అర్జంటుగా చంద్రబాబు తన దొంగ అకౌంట్ల పాస్ వర్డులను మార్చేయాలి!: విజయసాయిరెడ్డి

  • మురళీ మోహన్, నారాయణ ఇంకా మిగిలారు
  • వీరు దొరికితే బాబు బినామీ ఖాతాలు బయటకొస్తాయి
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు సీఎం రమేశ్, సుజనా చౌదరిపై ఆదాయపు పన్ను(ఐటీ)శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు బినామీలకు కేరాఫ్ గా ఉన్నవారిలో ఇప్పటికే సీఎం రమేశ్, సుజనా చౌదరి అనే ఇద్దరు దొరికారని ఆయన ఎద్దేవా చేశారు. వీరిద్దరూ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక జయభేరి మురళీమోహన్, మంత్రి నారాయణ కూడా పట్టుబడితే చంద్రబాబు బినామీ ఖాతాలు చాలావరకూ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

ఆంధ్రాలో కనీస అభివృద్ధిని చేపట్టలేకపోయిన సీఎం చంద్రబాబు తెలంగాణను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. బహుశా చంద్రబాబు తాను ఏపీ సీఎం అన్న సంగతి మర్చిపోయి ఉంటారని ఎద్దేవా చేశారు. తన అసమర్థత, అవినీతితో గత నాలుగున్నరేళ్లలో ఏపీని అన్నిరంగాల్లోనూ చంద్రబాబు దిగజార్చారని ఆయన విమర్శించారు.

టెక్నాలజీ సృష్టికర్త అని చెప్పుకునే చంద్రబాబు.. సుజనా, సీఎం రమేశ్ వంటి వీక్ పాస్ వర్డులు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిని ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, రెవిన్యూ ఇంటెలిజెన్సు, ఈడీ, ఐటీ శాఖ ఈజీగా బ్రేక్ చేశాయన్నారు. అర్జంటుగా మిగతా పాస్ వర్డులను మార్చి మిగిలిన దొంగ అకౌంట్లను ఓపెన్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News