Amith shah: అమిత్ షాకు కేసీఆర్ బిర్యానీ పంపలేదన్న బాధ ఉంటే.. కల్యాణి బిర్యానీ పంపిస్తాం: ఒవైసీ సెటైర్

  • మీకు కావాలంటే మీరు కూడా తినండి
  • ఎవరో తింటే మీకెందుకు కడుపునొప్పి
  • కల్యాణి బిర్యానీ పార్శిల్ పంపిస్తాం

రాష్ట్రంలోని ముస్లింలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిర్యానీ పంపారంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. నేడు కూకట్‌పల్లి ఏరియాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షాను ఉద్దేశించి.. మీకు పంపలేదన్న బాధా? మీకు కూడా కల్యాణి బిర్యానీ పంపిస్తారంటూ ఎద్దేవా చేశారు.

‘మీకు కావాలంటే మీరు కూడా తినండి. ఎవరో తింటే మీకెందుకు కడుపునొప్పి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అమిత్ షా బిర్యానీని ఇష్టపడతారో లేదో తెలియదని.. కానీ తనకు పంపించి.. ఆయనకు పంపించలేదని భావిస్తే మాత్రం ఆయనకు కూడా కల్యాణి బిర్యానీ పార్శిల్ పంపిస్తామన్నారు. ప్రధాని మోదీ ఎలాంటి ఆహ్వానం లేకుండానే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి వెళ్లారని.. అక్కడ ఆయన ఏం తిన్నారో ఎవరికి తెలుసని ఒవైసీ ఎద్దేవా చేశారు. కాగా,హైదరాబాదులో బీఫ్ తో తయారుచేసిన బిర్యానీని కల్యాణి బిర్యాని అంటారు.

More Telugu News