Kodandaram: రేవంత్ రెడ్డి ఓ కొదమసింహం: కోదండరామ్

  • కొడంగల్ ప్రాంతంలో ఎదిగిన యువనేత రేవంత్ రెడ్డి
  • తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నేత
  • కృష్ణా నదీ జలాలు తెస్తానని కేసీఆర్ మోసం చేశారు
  • బీడు భూములను చూస్తుంటే బాధేసిందన్న కోదండరామ్

మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ జిల్లాలో ఏ పార్టీకి సరైన నాయకత్వం లేని వేళ, ఓ యువకుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి, రాజకీయాల్లో రాణించి, ఇక్కడి ప్రజల సమస్యలను తీరుస్తూ, ఓ కొదమసింహంలా ప్రభుత్వాలతో పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ప్రజాకూటమి కన్వీనర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు.

ఈ మధ్యాహ్నం కోస్గిలో జరిగిన సభకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన నేతల్లో రేవంత్ కూడా ఉన్నారని గుర్తు చేసిన ఆయన, కృష్ణా నదీ జలాలను ఇక్కడికి తెస్తానని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్కా కృష్ణానదిలోకే వెళుతుందని గుర్తు చేసిన ఆయన, చాలా సులభంగా ఆ నీటిని ఈ ప్రాంతానికి తరలించవచ్చని, కానీ ఆ ఆలోచన పాలకులకు రాలేదని విమర్శలు గుప్పించారు.

ఇక్కడి పొలాలు బీడు భూములుగా కనిపిస్తున్నాయని, వస్తాయనుకున్న నీరు రావడం లేదని, ముక్కెక్కడుందంటే, చుట్టూ తిప్పి చూపించినట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జూరాలను వదిలి శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. ఆయన మాటలను నమ్మేందుకు చెవుల్లో పూలు పెట్టుకుని లేమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదల ఉన్నవారని, ఇక్కడికి నీరు తెప్పించేవరకూ వారు విశ్రమించరని అన్నారు. కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలిసిన తరువాతనే కేసీఆర్ ను వ్యతిరేకించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాల్సిందేనని స్పష్టం చేశారు.

More Telugu News