Rajinikanth: ముంబైలో రికార్డులు బద్దలు కొడుతున్న రజనీకాంత్ ‘2.0’ సినిమా టికెట్ ధరలు!

  • శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ‘2.0’
  • ఓ రేంజ్‌లో అమ్ముడుపోతున్న టికెట్లు
  • రూ.1550 అయినా హాట్ కేక్‌లుగా మారిన వైనం

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కాబోతున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్ సినిమా ‘2.0’ విడుదలకు ముందే రికార్డులు బద్దలుగొడుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీల్లో ఇప్పటికే సినిమా టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. రజనీ సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో టికెట్లను భారీగా పెంచి విక్రయిస్తున్నారు.

టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ల ప్రకారం.. కనీస టికెట్ ధర రూ. 118 కాగా, గరిష్ట ధర రూ.1550. ముంబైలో అత్యధిక ధరకు అమ్ముడుపోతున్న టికెట్లు ఇవే కావడం గమనార్హం. రెండు థియేటర్లు ఈ టికెట్లను విక్రయిస్తుండగా ఓ థియేటర్‌‌లో బుకింగ్ ఇప్పటికే ముగిసింది. రూ.1550 అయినా క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇక ముంబై తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో రూ.1450కి టికెట్లు విక్రయిస్తున్నారు. రూ.1030 ధరతో కోల్‌కతా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూరు, చండీగఢ్, పూణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా టికెట్లను విక్రయిస్తున్నారు.

More Telugu News