modi: ప్రధాని మోదీ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడారు: కవిత

  • పసుపు బోర్డును కేంద్రం ఎందుకు ఇవ్వలేదు?
  • కేంద్రం నుంచి మాకు ఎలాంటి తోడ్పాటు లేదు
  • టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అందరూ కలసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు

నిజామాబాద్ బీజేపీ నేతలు ఏం రాసిచ్చారో కానీ... ప్రధాని మోదీ తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడారని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ లో అభివృద్ధి జరగలేదని, పేద రాష్ట్రాల కంటే అధ్వానంగా ఉందని... విచిత్రమైన మాటలు మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ ను తాము ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము ఎన్నోసార్లు అడిగినా ఇంతవరకు మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులకు పనికొచ్చే ఇలాంటి మంచి పనులపై మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదని అడిగారు. నిజామాబాద్ ఉన్నతి కోసం తాము ఎంతో పని చేస్తున్నా... అదే స్థాయిలో కేంద్రం నుంచి ఎలాంటి తోడ్పాటు రావడం లేదని అన్నారు.

నిజామాబాద్ లో రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికీ నీరు ఇస్తున్నామని, కరెంట్ ఇస్తున్నామని, పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నామని... ఇలాంటి సందర్భంలో కొంత దుమ్ము ఉండవచ్చని చెప్పారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అందరూ కలసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ఆరోపించినట్టు కాంగ్రెస్ తో తమకు మ్యాచ్ ఫిక్సింగ్ లేదని... ప్రజలతోనే తమకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని చెప్పారు.  

More Telugu News