Sunita: హరికృష్ణన్న కూతురు గెలిచి తీరుతుంది: పరిటాల సునీత

  • సుహాసినితో కలసి ఎన్నికల ప్రచారం
  • టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు
  • అవసరమైతే మరో రెండు రోజులు తిరుగుతా: సునీత

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని విజయం సాధించి తీరుతారని ఏపీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఈ ఉదయం సుహాసినితో కలసి ఓపెన్ టాప్ జీప్ లో కూకట్ పల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడారు.

"హరికృష్ణన్న కూతురికి టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుహాసిని గెలుపుకోసం రెండు రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్నాను. అవసరమైతే ఇంకో రెండు రోజులు ఉంటాను. ప్రతి ఇల్లూ తిరిగి, భారీ మెజారిటీతో సుహాసినిని గెలిపించాలని కోరనున్నా. ఇక్కడి ప్రజల స్పందన చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతోంది. ఆమె గెలుపు ఖాయం" అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు.

 తన తండ్రి మరణించారన్న బాధను దిగమింగుకుని, ఆమె ప్రజల వద్దకు వచ్చారని, ఇప్పుడు ప్రజలంతా సుహాసినిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్న 13 చోట్లా విజయం ఖాయమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

More Telugu News