New Delhi: వేధింపులు తాళలేక బస్సులో నుంచి దూకేసిన ఢిల్లీ యువతి!

  • నిత్యమూ కాలేజీకి వెళ్లి వచ్చే యువతి
  • రెచ్చిపోయే ఆకతాయిలు
  • మరిన్ని వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు

నిత్యమూ ఆకతాయిలు ఏడిపిస్తుంటే, వాటిని తాళలేక, కదులుతున్న బస్సులో నుంచీ దూకేసిందో ఢిల్లీ యువతి. ఆమె సోదరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ కాగా, పోలీసు అధికారులు స్పందించారు. మరిన్ని వివరాలు తెలియజేయాలని ఆమెను కోరారు. బాధితురాలి సోదరి కథనం ప్రకారం, ఢిల్లీ వర్శిటీలో చదివే ఓ విద్యార్థిని, నిత్యమూ రూట్ నంబర్ 544లో ప్రయాణిస్తుంటుంది. ఆమెకు ఆకతాయిల నుంచి వేధింపులు అధికమయ్యాయి. గతంలో ఓ మారు వేధిస్తున్న విషయాన్ని ఇతర ప్రయాణికులకు చెప్పడంతో, ఆ ఆకతాయిని కిందకు దించేశారు. అయినా అతను వదల్లేదు. అదే రూట్ లో కనిపిస్తూ, ఆమెపై వేధింపులను మరింతగా పెంచారు.

"నా సోదరి కొన్ని రోజులు వేరే మార్గాల్లో కాలేజీకి వెళ్లింది. రూట్ మారడం వల్ల కాలేజీకి అలస్యంగా చేరుకునేది. దీంతో తిరిగి 544 రూట్ లోనే ప్రయాణం సాగిస్తోంది. చాలా మంది అమ్మాయిలు ఈ మార్గంలో వెళుతుంటారు. దీన్ని అదనుగా చేసుకునే ఆకతాయిలు వేధింపులతో రెచ్చిపోతున్నారు. శనివారం నాడు నా సోదరి బస్సు నుంచి దూకేసి గాయాల పాలైంది. 'నీ గురించి మాకు మొత్తం తెలుసు. నువ్వు చదువుతున్నది ఎక్కడో కూడా తెలుసు' అంటుంటే భయపడింది" అని ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన ఆ ప్రాంత డీసీపీ విజయ్‌ కుమార్‌, ఈ మార్గంలో పోలీసుల నిఘాను పెంచి అమ్మాయిలకు భద్రత కల్పిస్తామని అన్నారు.

More Telugu News