MS Dhoni: 'ఈ ధోనీ ఎక్కడ దొరికాడు మీకు?'.. నాటి ముషారఫ్ ప్రశ్నను గుర్తు చేసుకున్న గంగూలీ!

  •  కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ లో పర్యటించిన ధోనీ
  • వాఘా సరిహద్దుల్లో తిరుగుతుంటే లాక్కున్నామని గంగూలీ సరదా సమాధానం
  • ధోనీపై ముషారఫ్ ప్రశంసలు 

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తాజాగా ఓ పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. జట్టులోకి ధోనీ వచ్చిన కొత్తల్లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ లో పర్యటించిన ధోనీ, అక్కడాడిన మెరుపు ఇన్నింగ్స్ ను ఎవరూ మరచిపోలేరని వ్యాఖ్యానించాడు.

ధోనీ ఆటను చూసిన అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ సైతం ముగ్ధుడై, ధోనీ గురించి తన వద్ద మాట్లాడారని చెప్పాడు. "నాకు ఇప్పటికీ గుర్తుంది... ముషారఫ్‌ నా వద్దకు వచ్చి 'ఈ ధోని ఎక్కడ దొరికాడు మీకు?' అని అడిగారు. దానికి బదులుగా నేను, 'వాఘా సరిహద్దుల్లో తిరుగుతుంటే మేం మా దేశంలోకి లాక్కున్నాం' అని సరదాగా అన్నాను" అని చెప్పాడు. కాగా, అప్పట్లో ధోనీ వీర బాదుడును ప్రత్యక్షంగా తిలకించిన ముషారఫ్, వేదికపైనే ప్రశంసల వర్షం కురిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

More Telugu News