Khammam District: ఖమ్మంలో ‘తుమ్మల’ ఆధిపత్యాన్ని కేటీఆర్ తట్టుకోలేకపోయారు.. రెబెల్స్ ను పెట్టి పార్టీని నాశనం చేశారు!: బుడాన్ బేగ్

  • జిల్లాలో పార్టీ పూర్తిగా నిర్వీర్యమయింది
  • ఈసారి ఒక్క సీటు దక్కించుకున్నా గ్రేటే
  • కేసీఆర్ కు వందల సార్లు ఫోన్ చేశా

ఖమ్మం జిల్లాలో పదికి 10 సీట్లు గెలిపించే సత్తా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఉందని టీఆర్ఎస్ తిరుగుబాటు నేత బుడాన్ బేగ్ తెలిపారు. అయితే తుమ్మల పలుకుబడిని తట్టుకోలేకపోయిన కేటీఆర్ ఆయనకు కౌంటర్ గా మరికొందరు నేతలను రంగంలోకి దించారని ఆరోపించారు. తద్వారా జిల్లాలో పార్టీని చేతులారా నిర్వీర్యం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక సీటు దక్కితే గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నయా నియంతగా తయారయ్యారని బుడాన్ బేగ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ మంత్రులకే ఇప్పుడు దిక్కులేదని వ్యాఖ్యానించారు. అపాయింట్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ కు తాను వందల సార్లు ఫోన్ చేశాననీ, మెసేజ్ పెట్టానని బేగ్ అన్నారు.

అయినా ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 28న ఖమ్మంలో జరిగే మహాకూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో బేగ్ టీడీపీలో చేరతారని ఆయన సన్నిహితులు తెలిపారు.

More Telugu News