Andhra Pradesh: అనంతపురం నుంచి ఉద్ధానం వరకూ ఎక్కడికి వెళ్లినా నాకు ఒకే ప్రశ్న ఎదురవుతోంది!: పవన్ కల్యాణ్

  • చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదు
  • సమస్యలతో రైతులు బాధపడుతున్నారు
  • పోరాట యాత్రలో రైతన్నలతో జనసేనాని భేటీ

అనంతపురం నుంచి  ఉద్ధానం వరకూ ఎక్కడకు పోయినా రైతుల నుంచి తనకు ఒకే ప్రశ్న ఎదురవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ‘ఏదైనా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, అధికారుల దగ్గరకు పోతే ప్రభుత్వానికి చెప్పుకో’ అని రైతులకు అధికారులు సూచిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అదే రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళితే ‘ఈ విషయాన్ని కలెక్టర్ కు చెప్పండి.. నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది?’ అని చెబుతున్నారన్నారు.

దీంతో సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరకు పోవాలో తెలియక రైతులు అల్లాడిపోతున్నారని పవన్ అన్నారు. ‘మా సమస్యలను పరిష్కరించి న్యాయం ఎవరు చేస్తారో తెలియడం లేదయ్యా’ అంటూ రైతులు విలపిస్తున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పోరాటయాత్రలో భాగంగా జనసేనాని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతన్నల సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతన్నల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తిప్పించుకుంటోందని దుయ్యబట్టారు. అన్నం పండించే రైతుకు అండగా ఉండని ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎంతసేపు సింగపూర్ తరహా రాజధాని, సింగపూర్ తరహా ప్రభుత్వం అని చంద్రబాబు అంటున్నారనీ, కానీ రైతులకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలి? అని మాత్రం ఆలోచించడం లేదని దుయ్యబట్టారు.

More Telugu News