jarkhand: తండ్రిని బతికించేందుకు శవానికి 6 నెలలుగా క్షుద్ర పూజలు.. తనయుడి అరెస్ట్!

  • జార్ఖండ్ లోని మకత్ పూర్ లో ఘటన
  • అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి విశ్వనాథ్
  • రసాయనాలు, ఐస్ తో శవాన్ని భద్రపరిచిన తనయుడు 

తండ్రి చనిపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. క్షుద్ర పూజల ద్వారా తండ్రి బతుకుతాడని నమ్మిన అతను శవాన్ని కుళ్లిపోకుండా భద్రపరిచి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు నెలల పాటు పూజలు కొనసాగించాడు. జార్ఖండ్ లోని మకత్ పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి ఇందిరాకాలనీలో ఉంటున్న విశ్వనాథ్‌ ప్రసాద్‌(75) అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించాడు. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి తండ్రి శవాన్ని కుళ్లిపోకుండా ప్రత్యేక రసాయనాలు పూసి ఐస్ లో భద్రపరిచాడు. గత ఆరు నెలలుగా శవం ముందు కూర్చుని పూజలు చేస్తూనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహించాలని తల్లి, చెల్లి ప్రశాంత్ కు సూచించారు.

దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్ ఇంటిపై దాడి చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విశ్వనాథ్ అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ప్రశాంత్ కుమార్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.

More Telugu News