Telangana: నందమూరి సుహాసినికి షాక్.. కూకట్ పల్లిలో మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు!

  • అల్లాపూర్ డివిజన్ లో ఈరోజు ఘటన
  • టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

తెలంగాణలోని కూకట్ పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కూకట్ పల్లిలోని అల్లాపూర్ డివిజన్ లో ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే సుహాసినికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి రణరంగంగా మారడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ నేపథ్యంలో సుహాసిని తన ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు. ఈ విషయమై టీడీపీ నేత ఒకరు మాట్లాడుతూ.. అల్లాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ కార్యాలయం మీదుగా వెళుతుండగా ఆ పార్టీ సభ్యులు తమ ప్రచారాన్ని అడ్డుకున్నారని తెలిపారు. తమను దుర్భాషలాడుతూ రెచ్చగొట్టినా సంయమనంతో వ్యవహరించామని చెప్పారు.

గొడవకు కారణమైన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిన్న కూకట్ పల్లిలో జరుగుతున్న సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇదే రీతిలో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గొడవను అణచివేసేందుకు ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జి చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు.

More Telugu News