Telangana: ఓటర్లకు పేటీఎం ద్వారా చెల్లింపులు.. పండగ చేసుకుంటున్న అభ్యర్థులు!

  • పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్న నేతలు
  • క్యాష్ పై పరిమితి విధించడంతో నేతల కొత్తదారి
  • ఓటర్లకూ డిజిటల్ రూపంలో తాయిలాలు

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తుంటాయి. మిక్సీలు, వాచీలు, సైకిళ్లు ఉచితంగా అందిస్తామని కొన్ని రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తే, ల్యాప్ టాప్ లు, టీవీలు ఫ్రీగా ఇస్తామని మరికొన్ని పార్టీలు ప్రజలకు ఆశపెడతాయి. ఈ సందర్భంగా అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రూ.500 నుంచి రూ.2,000 వరకూ చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రలోభాలను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థులు కొత్తదారి కనిబెట్టారు.

డబ్బులు, మద్యం తీసుకెళుతుంటే ఈసీ అధికారులు, పోలీసులు పట్టుకుంటున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కొత్త రూట్ ను ఎంచుకున్నారు. అదే పేటీఎం యాప్. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతలు పగటిపూట ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. అనంతరం రాత్రిపూట గుట్టుగా వాళ్ల పేటీఎం వ్యాలెట్ కు బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం నేతలు ప్రత్యేకంగా కొందరు సిబ్బందిని సైతం నియమించుకున్నారు.

అలాగే ఎన్నికల ప్రచారానికి వచ్చే యువత, మహిళలకు కూడా పేటీఏం ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్‌లో కొన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు ఇలా పేటీఎంతో చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News