Chiranjeevi: గాయని పసల బేబీని ఇంటికి పిలిపించుకుని అభినందించిన మెగాస్టార్.. ఆమె టాలెంట్‌కు చిరు ఫిదా

  • బేబీ పాటకు ప్రముఖులు ఫిదా
  • ఫ్యాన్‌గా మారిపోయిన చిరంజీవి భార్య సురేఖ
  • ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన మెగాస్టార్ 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ హాట్ టాపిక్. మట్టిలోని మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనమైన ఆమె పాటకు టాలీవుడ్ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇళ్లలో పనిచేసే ఆమె సరదాగా పాడిన పాటను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. టాప్ సింగర్లను తలపించేలా పాడుతున్న ఆమెకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. చదువు రాని, సంగీతం తెలియని ఆమె శ్రుతి లయలు తప్పకుండా పాడుతుంటే ఆశ్చర్యపోయారు. తొలుత ఆమెను గుర్తించిన టీడీపీ నేత, ఎంపీ మురళీ మోహన్ సన్మానించి, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆ తర్వాత ఏ ఆర్ రహమాన్ కూడా ఆమె పాటను విని అభినందించాడు.

ఇటీవల ఆమె పాటను విన్న మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా బేబీకి ప్యాన్‌గా మారిపోయారు. ఆమెను చూడాలని, ఆమె పాటను వినాలన్న కోరికను చిరంజీవి వద్ద వ్యక్తపరిచారు. దీంతో ఆమె గురించి వాకబు చేసిన చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సహకారంతో ఆదివారం ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు. చిరంజీవి అంతటి వ్యక్తి తన ఇంటికి పిలిపించుకోవడంతో బేబీ ఆనందాన్ని పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్బంగా కొన్ని పాటలు పాడిన ఆమె చిరూ ఫ్యామిలీని మెస్మరైజ్ చేసింది. తనకు ఈ అవకాశం కల్పించిన కోటికి ధన్యవాదాలు తెలిపింది.

More Telugu News