perni nani: 45 కోట్లతో పవన్ కల్యాణ్ ఇల్లు కట్టించారు.. దీనికి చిరంజీవి మాత్రమే వెళ్లారు: పేర్ని నాని

  • ఓటుకు నోటు, కాల్ మనీ విషయంలో చంద్రబాబును పవన్ ప్రశ్నించలేదు
  • చంద్రబాబును గెలిపించడానికి పవన్ యత్నిస్తున్నారు
  • 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడింది

హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 45 కోట్లతో ఇల్లు కట్టించారనే ప్రచారం జరుగుతోందని... ఆ ఇంటికి కేవలం చిరంజీవి మాత్రమే వెళ్లారని చెబుతున్నారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ్ మీరు గృహ ప్రవేశాలు చేస్తున్నారు... మీరు ఎక్కడుంటారో మీకైనా తెలుసా? అని ప్రశ్నించారు. కాల్ మనీ, ఓటుకు నోటు విషయంలో చంద్రబాబును పవన్ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే... దానిపై పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి పవన్ పారిపోయారని... అప్పటి నుంచి ఆయన పారిపోతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికే పవన్ యత్నిస్తున్నారని పేర్ని నాని అన్నారు. అమరావతి ప్రాంతంలో కోట్లు విలువ చేసే భూమిని పవన్ కు లింగమనేని రమేష్ కేవలం రూ. 25 లక్షలకే ఇచ్చారని... దానికన్నా తాము మరో రూ. 5 లక్షలు ఎక్కువ ఇస్తామని... దాన్ని పవన్ తమకు ఇస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడిందని విమర్శించారు. 

More Telugu News