jagan: జగన్ కు రాజీనామా లేఖను పంపించిన మండపేట నేత లీలాకృష్ణ

  • వైసీపీకి షాక్ ఇచ్చిన మండపేట కోఆర్డినేటర్ లీలాకృష్ణ
  • జగన్ పాదయాత్రలో అన్నీ తానై చూసుకున్న నేత
  • టికెట్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో.. కొంత కాలంగా పార్టీకి దూరం

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. నియోజకవర్గంలో వైసీపీలో చోటుచేసుకున్న వర్గ విభేదాల నేపథ్యంలో గతంలో పని చేసిన వేగుళ్ల పట్టాభిరామయ్యను సైతం పక్కన పెట్టి... లీలాకృష్ణకు కోఆర్డినేటర్ బాద్యతను జగన్ అప్పగించారు. జగన్ పాదయాత్ర సమయంలో కూడా ఆయన నేతృత్వంలోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి.

ఆ తర్వాత సీటు కోసం ఇద్దరు నేతలు పోటీపడ్డారు. సీటు ఎవరికి దక్కుతుందనే విషయంలో క్లారిటీ రాకపోవడంతో... ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి టికెట్ రేసులో ఉన్నారని సమాచారం. దీనికి తోడు బీసీ సామాజికవర్గానికి చెందిన తులసీకుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రియలెస్టేట్ వ్యాపారి కార్నాకుల రామాంజనేయులు కూడా టికెట్ కోసం యత్నిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో, లీలాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు.

More Telugu News