Anchor: సుమ దొడ్డ మనసు.. తిత్లీ తుపానులో సర్వం కోల్పోయిన వృద్ధ దంపతులకు ఇల్లు కట్టిస్తున్న యాంకర్

  • గూడు కోల్పోయిన వృద్ధ దంపతులు
  • పూర్తి కావచ్చిన ఇంటి నిర్మాణం
  • రైతులనూ ఆదుకునేందుకు సిద్ధం

ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల తన పెద్ద మనసును మరోమారు చాటుకుంది. శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేసిన తిత్లీ తుపానులో సర్వం కోల్పోయిన ఓ వృద్ధ దంపతులకు సుమ అండగా నిలిచింది. సాయం చేసి వదిలేయకుండా వారికోసం ఓ ఇల్లు కట్టిస్తోంది. సుమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ శ్రీకాకుళం వెళ్లినప్పుడు తుపానుతో జిల్లా ఎలా నష్టపోయిందీ వివరించాడు. ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఇల్లు కూలిపోయి ఓ వృద్ధ జంట పడుతున్న అవస్థల గురించి వివరించాడు.

 అది విని చలించిపోయిన సుమ కళిగాం గ్రామంలో ఇల్లు కోల్పోయి రోడ్డున పడిన వృద్ధ దంపతులకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చింది. వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని సుమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. సుమ మంచి మనసుకు అందరూ అభినందిస్తున్నారు.

More Telugu News